Daggubati Purandeswari: సోము వీర్రాజు భవిష్యత్తును బీజేపీ హైకమాండ్ నిర్ణయిస్తుంది: పురందేశ్వరి

  • పార్టీలోకి వలస వచ్చిన వారికి టికెట్లు కేటాయించామనే ఆరోపణలు సరికాదన్న పురందేశ్వరి
  • కావాలని ఎవరినీ పక్కన పెట్టలేదని వ్యాఖ్య
  • బీజేపీకి 11వ ఎమ్మెల్యే సీటు వస్తుందని ఆశాభావం
BJP high command will decide the future of Somu Veerraju says Purandeswari

ఏపీ ఎన్నికల్లో పోటీకి సంబంధించి బీజేపీ రాష్ట్ర చీఫ్ పురందేశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీలో ఉన్న పాతవారు, కొత్తవారు అందరూ బీజేపీ వారేనని ఆమె అన్నారు. రాష్ట్రంలో బీజేపీకి మరిన్ని సీట్లు పెరుగుతాయని ఆశిస్తున్నట్టు తెలిపారు. బీజేపీకి 11వ ఎమ్మెల్యే సీటు వస్తుందని... ఆ సీటు ఎక్కడి నుంచి అనేది నిర్ణయిస్తామని చెప్పారు. బీజేపీ, జనసేన, టీడీపీలు కలిసి ఎలా ముందుకు వెళ్లాలనేదానిపైనే తమ ఆలోచన అని అన్నారు. 

బీజేపీ ఏపీ మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు గురించి ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోము వీర్రాజు భవిష్యత్తును పార్టీ హైకమాండ్ నిర్ణయిస్తుందని చెప్పారు. పార్టీలోకి వలస వచ్చిన వారికి టికెట్లు కేటాయించామని ఆరోపించడం సరికాదని అన్నారు. రాజకీయ, సామాజిక పరిస్థితులకు అనుగుణంగానే టికెట్లను కేటాయించామే తప్ప... కావాలని ఎవరినీ పక్కన పెట్టలేదని చెప్పారు. పార్టీ హైకమాండ్ తీసుకునే నిర్ణయాలను బీజేపీ నేతలు, కార్యకర్తలు అందరం గౌరవిస్తున్నామని తెలిపారు. పొత్తులో భాగంగా బీజేపీకి 10 ఎమ్మెల్యే, 6 ఎంపీ సీట్లు దక్కిన సంగతి తెలిసిందే. బీజేపీ మరో ఎమ్మెల్సీ సీటును కోరుతోంది.

More Telugu News